3, అక్టోబర్ 2011, సోమవారం

ఓ సామాన్యుడిని

ఎవరికి...ఏమని చెప్పాలో తెలియడంలేదు...

గడిచిన రెండేళ్ళలో జరిగిన అభివ్రుద్ధి తలచుకుంటే గుండె భారమౌతోంది...మనలో మానవతా విలువలు ఇంతగా దిగజారిపోయాయా!?!!

ప్రత్యేక తెలంగాణా కావచ్చు,సమైఖ్యాంధ్ర కావచ్చు...లేక ఇంకోటి కావచ్చు....దయచేసి ఉధ్యమాల పేరిట ప్రజల్ని బలి కానివ్వకండి.

ఉధ్యమాలు ఎలా చేయాలో ఈ కాలంలో కూడా ఓ కురువ్రుద్ధుడు (అన్నా హజారే) చేసి చూపించారు.ఆ ఉధ్యమనికి దేశం మొత్తం మద్దతు పలికింది.కానీ, ఎక్కడా ఒక చిన్న అద్దం కూడా పగలలేదు.ఘర్షణలు జరగలేదు.

మరి మన ఉధ్యమాలు ఎలా ఉన్నాయి???
ఎటు చూసినా ఏమున్నది నా రాష్ట్రంలో...మూతబడిన సేవలు,విధ్వంసాలు తప్ప...

అత్యవసర పరిస్థితిలో నగరానికి తీసుకెల్దామంటే అడుగడుగునా బంధ్ లు,ధర్నాలు...ఇంక పండుగల సంగతి సరే సరి...
సొంత వూళ్ళోని బంధువులను కలువలేని పరిస్థితి.

ఈ రోజు టివిలో చూసిన ఓ వార్త నా గుండెను కలచి వేసింది.

ఒక ఊరు నుంచి నగరానికి చేరుకున్న బస్సుపైకి రాళ్ళు రువ్వారు.బస్సుల అద్దాలు పగిలాయి.ఓ చిన్నారికి గాయాలయ్యాయి.పిల్లలు,స్త్రీలు,అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.పాపం వాళ్ళేం చేశారు??ఎవరు హర్షిస్తారని ఈ ఉధ్యమం???

నేను ఓ రాష్ట్రం లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాను.ఇక్కడ ప్రాంతాలకతీతంగా తెలుగు వారమంతా అన్నోన్యంగా ఉంటాం.కలిసే భొoచేస్తాం.సమస్యల గురించీ మాట్లాడు కుంటాం.

హైదరాబాదు చరిత్రని,తిరుపతి వేంకటేశుని,బెజవాడ ధుర్గమ్మనీ చూడకుండా ఉండలేం...

రాష్ట్రం ముక్కలైనా సరే, కలిసి ఉన్నా సరే...మాకు కావలసింది అందరి ఆత్మీయతలే...పోరు బాటలో వాటికి దూరం కాకండి.
శంతియుతంగా సాధించుకోండి. మీ మనుగడ కోసం సమాన్యుల్ని బలి కానియకండి.

ఇట్లు,
ఓ సామాన్యుడిని....

5, మార్చి 2011, శనివారం

ఈతరం అభిమన్యుడు





రాత్రి,
సమయం 11 గంటల 47 నిముషాలు.

నిర్మలంగా ఉన్న వాతావరణం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.జరగబోయే దారుణం ముందే వూహించాడేమో..... చంద్రుడు కూడా చూడలేక మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు.శక్తి నశిస్తోంది.అడుగు తడబడుతోంది.అయినా సరే,ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని పరిగెడుతున్నాడతను....చీకటిలో దారి సరిగా కనిపించడం లేదు.అక్కడక్కడా ఏవో చిన్న చిన్న రాళ్ళూ,కొమ్మలు అడ్డుతగులుతున్నాయి. ఇప్పటికే తనకు తగిలిన గాయాలతో పోలిస్తే అవెంత...!?!!ఎలగైనా సరే,ఈ విషయాన్ని తోటి విద్యార్థులకి తెలియజేయాలి.లేకుంటే....

రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది.విధ్యార్థి లోకం అట్టుడికిపోతుంది...కోట్లాది ఆస్థులు ద్వంసమౌతాయి.పరీక్షలు వాయిదా పడతాయి....భవిష్యత్తు సర్వ నాశనమయిపోతుంది.జరగబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి.కాని శరీరమే సహకరించట్లేదు.ఇంకెంత,మరో 5 నిముషాలు వేగంగా పరిగెడితే హాస్టల్ ప్రహరి గోడ వచ్చేస్తుంది.

"ధభ్...!!!" తలవెనుకల గట్టిగా ఏదో తగిలింది.ఎగిరి ముందుకు పడ్డాడతను.ఇంతలోనే అతన్ని చుట్టుముట్టారు కొంతమందియువకులు.
అప్పటికే తగిలిన గాయాలవల్ల,విపరీతమైన ఆయాసం వల్ల లేవలేకపోతున్నాడతను.ఇంతలో ఒకడతని తలమీద గట్టిగా కొట్టాడు.అతడు అచేతనంగా పడిపోయాడు.
"చూసి కొట్టండి భే,అస్సల్...అనుమానం రాకుడదు!!!"....వెంటనే ఒకడు బలమైన రాడ్డుతో తలపైన బలంగా కొట్టాడు.
"........"
* * *
"చచ్చాడు యెదవ!!!ఎంత పరిగెత్తించాడ్రా మనల్ని....!!!" అన్నాడొకడు తెగ ఆయాశ పడుతూ.
"వదిలెయ్ రా!....చచ్చాడుగా...!" అంటూ కాస్త రిలాక్స్ అవదామన్నట్టు సైగ చేశాడింకొకడు.

'అంటే ఇంక కొట్టరన్నమాట!!' అనుకున్నాడతను.నిజానికి తను చావలేదు. చావుకి చాలా ద..గ్గ..ర్లో ఉ..న్నా..డు!!! శరీరం పనిచేయడం
మానేసింది.గట్టిగా స్వాస కూడా పీల్చలేని పరిస్థితి........

"....తనేమీ పెద్ద పెద్ద తప్పులు చేయలేదు.తనని చంపే అంతటి శత్రువులు కూడా లేరు.తనేంచేసినా అందరిలో ఒకడిగానే చేశాడు తప్ప ఎవరికీ ద్రోహం చేయలేదు.అంతా సవ్యంగా జరిగితే ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి మరో ఆరు నెలల్లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా చేరాల్సి వుంది.ఎందుకిలా జరిగింది!?..ఏంచేశాడు తను???"

ఎంసెట్ ఇంజినీరింగ్ లో మంచి ర్యాంక్ రావడంతో మూడున్నర సంవత్సరాల క్రితం ఆ యూనివర్సిటిలో చేరాడతడు.మొదటి రెండు సంవత్సరాలూ సజావుగానే సాగాయి.పరీక్షల్లో మంచి మార్కులు సాధించి అందరి మన్నలనూ పొందాడు.మొత్తానికి కాలేజిలో బాగా చదివేవాడని మంచి పేరే తెచ్చుకున్నాడు.మూడవ సంవత్సరం ప్రథమంలో కూడా బాగానే సాగింది.కాని...

సెప్టెంబరు-2009న అప్పటి ముఖ్యమంత్రి,గొప్ప నేత అయిన వై.యస్.రాజశేఖరరెడ్డిగారి మరణం రాష్ట్రంలో పలు సంచలనాలకు దారితీసింది. రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.అంతలోనే ప్రత్యేక తెలంగాణ,సమైఖ్యఆంధ్ర ఉధ్యమాలు తెర మీదకు వచ్చాయి.విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాష్త్రం మొత్తం కంపించి పోయింది.ఎటు చూసినా బంద్ లు,నిరాహార దీక్షలతో సతమతమైపోయింది.కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.ఎన్నో కోట్ల ఆస్థులు ధ్వంసమైయ్యాయి.ఈ విషయం పై అధ్యయనానికి హైకమాండ్ ఒక కమిటీని నియమించడంతో ఎన్నో రోజులుగా నెలకొన్న యుద్ధ వతావరణం తర్వాత నెమ్మదిగా చల్లారింది.కాని,జరగబోయే విధ్వంస కాండకి భీజం మాత్రం అప్పుడే పడిపోయింది.
* * *
పలుకుబడి పెంచుకోవడానికి,'అన్న' అని పిలిపించుకోవడనికి,రాజకీయ లబ్ధి పొందడానికి...కారణాలేవైతేనేం,వీధి రౌడీలు,దందాలు చేసే వాళ్ళూ రాజకీయాల్లో చేరి అసలే ఉడికిపొతున్న విద్యార్థుల్ని మరింత రెచ్చగొట్టారు.ఆస్థుల విధ్వంసం విషయంలో చాలా మంది విద్యార్థుల పైన కేసులు నమోదయ్యాయి.పోలీసులు విద్యార్థులకి,వారి తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ ఇచ్చి కొంత వరకూ కట్టడి చేయగలిగారు.కానీ,చెడుకి అలవాటుపడ్డ మనిషి మంచిని జీర్నించుకోవడం కష్టం కదా...

యూనివర్సిటిల్లో విద్యార్థులు బ్యాచ్ లుగా విడిపోవడం అమాంతం ఎక్కువైపోయింది.ప్రతి చిన్న చిన్న విషయాలని పెద్దవి చేయడం,క్లాసులు
బహిష్కరించడం,క్యాంటీన్ లో గొడవలు...లాంటివి ఇంకా క్కువయిపోయాయి.తమ బ్యాచ్ గొప్పదని చాటుకోవడనికి వీధి రౌడిలతో స్నేహాలకు పాల్పడ్డారు.ఏ బ్యాచ్ ల మధ్య గొడవలు వచ్చినా,ఆ బ్యాచ్ కి ఫలానా 'అన్న' తెలుసు,వాళ్ళతో జాగ్రత్తగా ఉండలనే స్థాయికి వచ్చేశారు.
* * *
ఇలాంటి విషయాలకి దూరంగా ఉండే కొంత మంది మాత్రం 'ఏదో వచ్చామా...వెళ్ళామా...' అన్నట్లు ఉండేవారు.ఇతను కూడా తన పనేదో తను చూసుకొని వెళ్ళేవాడు.అన్ని చీమలూ బెల్లం వైపు వెళ్తూంటే ఏ చీమైనా ఎంతవరకు వెళ్ళకుండా వుండగలుగుతుంది!!?!
క్రమంగా అలవాట్లు మారాయి...
వేషధారణ మారింది...
కొత్త కొత్త స్నేహాలు...

తనకి తెలియకుండా తానే మారిపోయాడు...

గ్యాంగ్ ఫైట్స్ లో పాల్గొనే స్థితికి వచ్చేశాడు.అంత మారినా న్యాయానికి విలువ ఇస్తాడని ఓ మంచి పేరు తెచ్చుకున్నాడు.కాలేజి భాషలో చెప్పాలంటే....హీరోలా అయిపోయాడు.

ఉధ్యమాల తరపున ప్రభుత్వంతో పోరడాడు.ఫలితంగా అతని పై కేసులు నమోదయ్యాయి.పోలీసులు అతని తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు.పరీక్షల సమయం కూడా దగ్గర పడుతూండడంతో చదువుకి పని చెప్పాడు.తర్వాత కొన్ని రోజులు అలాంటివాటికి దూరంగానే ఉన్నా కాలక్రమేణా మళ్ళీ దానికి అలవాటు పడిపోయాడు.పోలీసుల ముందు తన తల్లిదండ్రులు అలా నిలబడాల్సిరావడం అతన్ని తీవ్రంగా బాధించాయి....ఇంకోలా చెప్పాలంటే,తనకి తెలియకుండా తానే వ్యవస్థని అసహ్యించుకునేలా చేశాయి.

ఇంతలో మూడవ సంవత్సరం ఫలితాలు వచ్చేశాయి.మార్కుల శాతం తగ్గినా ఫస్టు క్లాసులోనే పాసయ్యాడు.అతడు తిరిగి తన 'పరిధి'ని పెంచుకుంటూపోతున్నాడు.

రాష్ట్ర రాజకీయల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టిలో ఉంటారో చెప్పడం కష్టమైపోతోంది.రెండు,మూడు పార్టీల నాయకులు ఓ చోట జనాన్ని పోగెయ్యడం,ఏదో విషయం మీద రోడ్డెక్కడం సాధారణ విషయంగా అయిపోయింది.చివరికి విదేశీయులకు, ప్రవాసాంధ్రులకు ప్రస్తుత పరిస్థితిలో మన రాష్ట్రానికి వెళ్ళకపోవడమే మంచిదనే 'సౌకర్యాన్ని' కల్పించారు.అసలే వ్యవస్థ మీద ద్వేషం
పెంచుకున్న ఇతనికి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఎదిరించి తమ కోరికలను సాధించుకోవలన్న విషయం బలంగా నాటుకుపోయింది.దానికి తోడు చిన్నా చితకా రాజకీయ రౌడీల అండతో మరింత రెచ్చిపోయాడు.పార్టి మీటింగ్ లకు,రాస్తా రోకోలకూ జనాల్ని తరలించేవాడు.
* * *
ఓ రోజు,
"హేయ్ విన్నీ!!!సాయంత్రం సినిమాకెళ్దాం వస్తావా!!?!..." వెటకారంగా అన్నాడతను ఓ అమ్మాయితో.ఆమె ఓ చూపలా చూసి ఏమనకుండా వెళ్ళిపోయింది.
"ఎంత పొగర్రా దీనికి??..."
"పొగరు కాదు మామా!ఈ అమ్మాయిలంతా అంతే, టైంపాస్ కే ప్రేమిస్తారు.డబ్బున్నోడినే పెళ్ళి చేసుకుంటారు.లేకపోతే సంవత్సరం పాటు నిన్ను ప్రేమించి చిన్న కారణానికే విడిపోవాలా..."
"అదేరా నేనూ అంటున్నది.ఎంత శంకరన్నతో తిరిగితే మాత్రం,ఆయనలాగ నేను రౌడిలా తయారౌతానా? ఏదో కాలేజికదా,సరదాకోసం తిరుగుతున్నా...కాలేజి అయిపోయాక కూడా అలాగే ఉంటానా?? మనకేం పన్లేదా??? ఇలా కాదు.వచ్చే నెల మన యూనివర్సిటికి కంపెనీలు వస్తున్నాయిగా!!!క్యాంపస్ ఇంటర్వూలో జాబ్ తెచ్చుకొని చూపిస్తా...నేనంటే ఎంటో...."
* * *

జాబ్ సంపాధించి ఆ అమ్మాయికి గర్వంగా చుపించినా ఏడుస్తూ వెళ్ళిపొయిందే తప్ప,తనతో మాట్లాడలేదు."ఏమైంది దీనికీ?" అనుకున్నాడే కాని దానికర్థం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

'నేను మునుపటిలా మారాలని,గొడవలకి దూరంగా ఉండాలనీ ఎంత పరితపించింది ఆ అమ్మయి?చివరికి తనే దూరమైపోయింది.ఎంత ప్రేమించివుంటే నాకోసం అంతలా ఏడుస్తుంది??కనీసం అప్పుడైనా నేను ఆలోచించి ఉండాల్సింది.తెలియకుండా ఎంతో ఇబ్బంది పెట్టాను.నాకీ శిక్ష
పడాల్సిందే'.

ఎక్కడికో మోసుకెళుతున్నారు తనని!!!తన అంచనా కరక్టే అయితే తనని ఎదైనా ఎత్తైన ప్రదేశం నుంచీ పడేయాలి.అన్ని గాయాలైన అతన్ని అనుమానం రాకుండా ఆత్మహత్యలా చూపించాలంటే అదొక్కటే దారి.ఎక్కడికి తీసుకెళుతున్నారు???

* * *
ఎప్పటిలానే అతన్ని,అతని ఫ్రెండ్స్ ఇద్దరిని మెయిన్ రోడ్డు దగ్గర దించి వెళ్ళిపోయిందో కారు.అక్కడి నుంచి అడ్డ దారిలో కొంత దూరం నడిస్తే వాళ్ళ హాస్టల్ వస్తుంది.

"మురళీ,భాస్కర్!మీరేమన్నా చెప్పండ్రా!!!ఈ విషయం లో మాత్రం నేను ఏకీభవించలేను.అరె,ఉధ్యమం కోసం ఒకణ్ణి చంపమనడమేంట్రా!!!"...
"రే,శంకరన్న ఉద్దేశ్యం అది కాదురా...కమిటీ నివేదిక ఇచ్చి రెండు నెలలు అవుతోంది.అయినా హైకమాండ్ నుంచి ఎలాంటి తీర్పు రాలేదు.మళ్ళీ ఉధ్యమాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.పోయిన సారి ఆ యూనివర్సిటిలో 10 మంది చనిపోయారు కదా,అపోజిషన్ పార్టి నాయకుడు ఆ యూనివర్సిటికి అండగా నిలబడి అక్కడి ప్రజలందరి అభిమానాలూ పొందాడు.రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి అతనే ఎం.ఎల్.ఏ అంట తెల్సా..?!! అరె మురళి,చెప్పరా.."అన్నాడు భాస్కర్.

"అయినా,అన్న చంపమని చెప్పలేదురా...ఆత్మహత్యాయత్నం లాంటి వాతావరణాన్ని స్రుష్ఠించమన్నాడంతె...బాగా చదివే ఒకడికి డ్రింక్ లో విషం కలిపి ఇద్దాం.కొంచం ఎఫెక్ట్ తెలియగానే మనమే హాస్పిటల్లో చేర్పిద్దాం!తర్వాత వాడికీ విషయం చెబితే వాడే అర్థం చేసుకుంటాడు.ఉధ్యమం కోసమే అలా చేశానని మీడియా ముందు వాడి చేతే చెప్పిద్దాం!!ఈ విషయం మీద అన్నతో కల్సి 4 రోజులు మీడియాలో హడావుడి చేశామనుకో,దెబ్బకి వాడూ
పాపులరయిపోతాడు.అన్నకి పబ్లిసిటి బాగా వస్తుంది.పైగా అన్న గెలిస్తే మనకే కదరా మంచిది!మనకు కావలసినవన్నీ జరుతాయిగా!!!...." అంటూ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు మురళి.

"మనం అన్నకి సపోర్ట్ చెయ్యాలి.కాదనను.కానీ చావుతో ఆటలేంట్రా!!మనలో ఎవరైనా ఉధ్యమం కోసం చనిపోతే అతని కొసం పోరాడుదాం, తప్పులేదు.కానీ ఒకర్ని చంపి దాన్ని రాజకీయం చేయడం....మహా పాపం రా!వాళ్ళంటే ఇలాంటివి చేసి పైకి వచ్చి వుండొచ్చు!మరీ ఇలాంటివి మనకొద్దురా......అర్థం చేస్కోండి..."

"నీకేం రా!ఇంకో ఆరు నెలల్లో జాబ్ లో చేరిపోతావ్!మా గురించి కూడా కాస్త ఆలోచించరా!!"....

"రేయ్!మీకేమన్నా పిచ్చి పట్టిందా!!ఇప్పుడు కనక ఇలాంటివి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమయిపోతుంది.అటు చూసినా బంద్ లు,దీక్షలు.అసలే పరీక్షలు దగ్గరపడుతున్నాయి.పిల్లల దగ్గరి నుంచి మనందరి భవిష్యత్తు నాశనమైపోతుంది.నిజంగా ఉధ్యమాల కోసం ఆత్మహత్య చేసుకునే వాడైనా ఇలాంటి పరిస్థితిలో ఎవడూ చేస్కోడు రా!కనీసం పిల్లల గురించైనా ఆలోచిస్తాడు!!ఉధ్యమాలు చేయడం మన బాధ్యతయితే,ఇలాంటివి జరగకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.

ఈ విషయం ఇంతటితో వదిలేయండి.ఈ విషయం లో మనం అన్నతో కలసి పనిచేయట్లేదు,అంతె.... " కోపంగా అన్నాడతను వారినుద్దేసించి.

"సర్లే,ఈ విషయమ్మీద అన్నకి ఎదో ఒకటి చెబుదాంలే కాని,ఓసారి నీ మొబైల్ ఇవ్వు,చిన్న కాల్ చేస్కోని ఇస్తా...."
మొబైల్ తీసి మురళికి ఇచ్చాడతను.

"ధన్.....!!!!!"

వెనుక నుంచి ఎవరో అతని తలపై కొట్టారు.పడబోతూ రెండగులు పక్కకి వేసి పక్కనున్న చెట్టుకొమ్మని పట్టుకుని లేచి నిలబడ్డాడు.
'వీళ్ళంతా....శంకరన్న మనుషులు!!!తననెందుకు కొడుతు.......భాస్కర్,మురళి ఏరి!!??!' అతని కను రెప్పలు పెద్దవయ్యాయి.
'ఓ..........మై........గాడ్!!!!!!!!!' అతనికి జరగబోయేదేంటో స్పష్టంగా అర్థమైపోయింది.

ఇంతలో తనని కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఒకడిని మధ్యలోనే ఒడిసి పట్టాడు.పిడికిలి బిగించి వాడి కడుపులో బలంగా కొట్టి,వాడి వెనుకల వస్తున్న వారి వైపు తోశాడు.ఊహించని విధంగా అలా జరగడంతో ఒకరికొకరు తగిలి అందరూ క్రిందపడ్డారు.

ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హస్టల్ వైపు పరిగెడుతున్నాడతను.

మరీ మెరిట్ స్టూడెంట్ కాకపోయినా తను ఓ రకంగా బాగా చదివే స్టూడెంటే.పైగా కాలేజీలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఒకవేళ తను చనిపోతే తన వైపు పోరాడే వాళ్ళు చాలా మందే ఉంటారు.'ఎంత పెద్ద స్కెచ్చేశార్రా!నన్నే చంపి ఆత్మహత్యగా చూపించాలంకుంటారా!!!భాస్కర్,మురళి పారిపోయి ఉంటారు.అవకాశావాదులు.రేపు వాళ్ళకీ ఇలా జరగదని నమ్మకమేంటి? అయినా ఇంకెంత,ఇంకో ఐదు నిమిషాలు వేగంగా పరిగెడితే హాస్టలు వచ్చేస్తుంది '.

* * *
కానీ అంతలోనే ఒకడు ఏదో విసరడం,అది తగిలి తను పడిపోవడం,తనని కొట్టడం,వాళ్ళ ద్రుష్ఠి లో తను చనిపోవడం అన్ని జరిగిపోయాయి.తనింకా కొన ఊపిరితో ఉన్నా,కనీసం మాట్లాడే శక్తి లేదు.ప్రస్తుతం ఎక్కడికో తీసుకెళుతున్నారు తనని.

చాలా రక్తం పోయింది.శరీరమంతా లోపలి నుంచి లాగుతునట్లుగా ఉంది.

'అమ్మ చాలా సార్లు చెప్పింది, మనకి రౌడీలతో,రాజకీయ నాయకులతో పరిచయాలు వద్దు,ఏమైన గొడవలు జరిగితే వాళ్ళు బాగానే ఉంటారు,నష్టపోయేది మనమే అని.వింటేగా?

ఆ మాటే వినివుంటేనా.....ఆరు నెలల తర్వాత మంచి జాబ్,రెండు సంవత్సరాల తర్వాత విన్నీని పెళ్ళి చేసుకొని హాయిగా ఉండే వాడిని.అయినా ఈ వయసులో ఎవరో కొందరు తప్ప,ఎవడు మాత్రం చెప్పిన మాట వింటాడు??వయసలాంటిది!!!ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టానో,ఇప్పుడింత దారుణంగా చస్తున్నా...'

చుట్టు పరిసరాలూ అవి చూస్తుంటే......అది తన కాలేజినే...బాయ్స్ హాస్టల్ కే తీసుకెళుతున్నారు తనని.అంటే తన హాస్టల్ పైనుంచే తనని పడేస్తారన్న మాట.తన గ్యాంగ్ వాడెవడైనా చూస్తే బావుండు!!!!!

దాదాపు అన్ని గదుల్లోనూ లైట్లు ఆఫ్ చేసున్నాయి.అక్కడక్కడ గదుల్లో లైట్లు వెలుగుతున్నా రూంలో వాళ్ళకి తాము కనిపించే ప్రసక్తేలేదు.
భాస్కర్,మురళిలు ముందే ఏర్పాట్లు చేసినట్లున్నారు.ఎటువంటి అనుమానం రాకుండా హాస్టల్ లోపలికి అతన్ని తీసుకొచ్చే తీసుకొచ్చేశారు శంకరన్న మనుషులు.ఎవరూ చూడకుండా ఒక్కో అంతస్థు పైకి తీసుకెళ్తున్నారు.

కళ్ళు మూతలు పడేలా ఉన్నాయి.స్ప్రుహ తప్పుతున్నట్లుగా ఉంది.ఇప్పటికైన హాస్పిటల్లో చేర్పిస్తే బ్రతుకుతాడేమో!కాని ఎవరూ తమని గమనించడంలేదు!!!

'అంతా అయిపోయింది.ఉధ్యమం కోసం తను ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రేపందరికీ తెలుస్తుంది.అపోజిషన్ పార్టిలన్ని చేరి తమ 'సానుభుతి'నీ,విద్యార్థులకి తమ 'మద్దత్తు'నీ తెలియజేస్తాయి.

మళ్ళీ బంద్ లు,రాస్తారోకోలు......ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరగబోతోంది.....

అమ్మానాన్నా,విన్నీ!!మీ మాట పెడచెవిన పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించబోతున్నాను.నన్ను క్షమించండి.మరో జన్మంటూ ఉంటే మీ ఆశలు నెరవేర్చే కొడుకుగా పుట్టి మీ రుణం తీర్చుకుంటా......ఐ మిస్ యూ విన్నీ!!!'

...........................????

తనని మెట్లమధ్యనే వదిలేసి వెళ్ళిపోతున్నారు......కాదు.....తనని వదిలేసి పా..రి..పో..తు..న్నారు!

అన్ని గదుల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి.అరుపులు పెద్దవౌతున్నాయి....

'హాహ్!నేను గెలిచాను.నా ఫ్రెండ్స్ ఎవరో చూసి ఉండి ఉంటారు.మొత్తానికి ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపగలిగాను!!!
ఇప్పుడు నేను చనిపోయినా ఎవరో హత్య చేసారంటారు కాని ఉధ్యమం కోసం ఆత్మహత్యలంటివి అసలు అనుకోరు...

అరుపులు పెద్దగా వినిపిస్తునాయి...నా వైపే వస్తున్నారు.......

భగవంతుడా....దయచేసి నన్ను బ్రతికించు!!!ఈ దుర్మార్గుల భరతం పడతాను...........'

----------------------------------------------

4, డిసెంబర్ 2010, శనివారం

గోవిందా…గోవింద…



17-మే-2002,
తిరుపతి.

తెల్లవారుతోంది.మాములుగా అయితే ఇంకాసేపు పడుకొని దొర్లేవాడినేమో!.కాని ఈ రోజెందుకో చాలా టెన్షన్ గా ఉంది. అయిష్టంగానే లేచి పేపరు తిరగేశాను.

నేడే ఎంసెట్ ఫలితాలు విడుదల

న్యూస్ టుడే,హైదరాబాద్.ఎంసెట్-2002 ఫలితాలు ఈరోజు ఉదయం 7.30గంటలకు జె.ఎన్.టి.యు క్యాంపస్,మాసబ్ ట్యాంక్ నందు విడుదలకానున్నాయి…

అంతే,మెదడు మొద్దుబారిపోయింది.దేవుడా,దేవుడా అనుకుంటూ కాం గా స్నానం చేసి తయారయ్యాను.అప్పటికి మవూళ్ళో ఇంటెర్నెట్ సెంటెర్లు కొన్ని మాత్రమే ఉండేవి.అవి కూడా 10గంటలకి కాని తెరవరు.ఈ ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మ్రోగింది…
“హలో గ్యానా!నేన్రా,రా రిజల్ట్స్ చూసుకుందాం”.
“వస్తున్నాను…”
                                          *                                     *                                   *
నా పేరు ఙ్ఞాన ప్రకాష్.అందరూ “ఙ్ఞాన” లేదా “ప్రకాష్” అంటారు.ఈ ప్రపంచంలో నా పేరుని ఖూని చేసి “గ్యానా” అని పిలిచేది ఒక్కడే… మా ముని గాడు.నెట్ సెంటెరుకెళ్ళి రిజల్ట్స్ చూసుకున్నాం…
సమయానికి మా అన్న ఆన్ లైన్ లోనే ఉన్నాడు.నా ర్యాంక్ పంపాను……5…8…7…5…2!?!!!
రేయ్!ఏందిరా ఇది?ఏదో ఫోన్ నెంబర్ చెప్పినట్లు చెప్తున్నావ్…ఏమైనా వస్తుందా…..క్,ఖ్,గ్,ఘ్,ఙ్……”
నా బుర్రకేమి ఎక్కడం లేదు.నా స్థాయికి కనీసం 20,000-25,000లోపు  వస్తుందనుకున్నాను… ఏంటిది?
ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి.మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాను.”మామా!నాకు 70వేలల్లో వచ్చిందిరా…నీకు??…”
హమ్మయ్య….వాడితో మాట్లడాక ఇంకొకడికి చేశాను.వాడికి ర్యాంకు ఏకంగా లక్ష పైనే…ఇంతలో కొంతమంది ఫ్రెండ్స్ రావడంతో అందరం కల్సి కాలేజికి వెళ్ళాం.పొయిన సంవత్సరం రాష్త్రంలో 5వ,13వ ర్యాంకులతో పాటు మంచి ర్యాంకులను తెచ్చుకొని తిరుపతిలోనే నెం.1గా నిలిచిన మా కాలేజి,ఈసారి పుట్టుకొస్తున్న కార్పొరేట్ సంస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోయింది. కనీసం 200వ ర్యాంకు కూడా అందుకొలేకపోయింది.నాకుమాత్రం కొంచం ధైర్యమేసింది.ఇంటికెళ్ళాను.
                                          *                                     *                                   *
58వేలా!!?!,ఇంక నీకు ఇంజినీరింగ్ సీటు వచ్చినట్లె…క్,ఖ్,గ్,ఘ్,ఙ్……” అంటూ వెళ్ళిపోయారు నాన్న.కాలేజి నిర్వహించే ఎంసెట్ పరిక్షల్లో మార్కులు బాగానే రావడంతో కొంచం ఆశలన్నా పెట్టుకొని ఉన్నారు.ఎందుకొ,బాగా బాదేసింది.కొన్నిరోజుల తర్వాత,ఇంటర్లో మార్కులశాతం బాగానే ఉండడంతో చెన్నైలోని ఓ కాలేజిలో పేమెంట్ సీటులో చేర్పించారు నాన్న.సిటి,పైగా ఊరికి దగ్గర కావడంతో చేరిపొయాను.
                                          *                                     *                                   *
మా సీనియర్ల బ్యాచ్ తోనే ప్రారంభించారంట ఆ కాలేజిని.పక్కన ఇంకా ఏవో కడుతూనే ఉన్నారు.మొదటి రోజు ఓ చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసి కాలేజి గురించి చెప్పారు.మద్యాహ్నం క్లాసులోకెళ్ళి కూర్చున్నాం.మొత్తం గోల గోలగా ఉంది.తెలుగోడు మరో తెలుగోడి పరిచయం కోసం చూస్తుంటే,తమిళోళ్ళు మరో తమిళుడిని వెతుకుతున్నారు.
“డు యు నో తమిళ్?” అని పలకరిచాడో వ్యక్తి.
“డొంట్ నో”…
“హాయ్!దిస్ ఇస్ బాలాజి!”.ఇంతలోనే…
“ఆర్ యు తెలుగు?”…
“యెస్…”
“నా పేరు బోస్.ఒంగోలు.”
“హాయ్!నా పేరు ఙ్ఞాన ప్రకాష్,తిరుపతి!!!”.ఆ రోజునుంచి ముగ్గురం ఒకటే బెంచ్.త్వరలోనే నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత నా వెనుక బెంచిలో కూర్చునే బాలక్రిష్ణ అనే అబ్బాయి కూడా మాతో కలిసి పోయాడు.
                                          *                                     *                                   *
రోజులు గడుస్తున్నాయి.లెక్చరర్లు చెప్పేది ఒక్క ముక్కా బుర్రకి ఎక్కట్లేదు.కొన్న పుస్తకాలని అటు ఇటు తిరగేసి అర్థం చేసుకునేలోగానే తొలి సెమిస్టెర్ పరిక్షలు వచ్చేశాయి.[మన యూనివర్సిటిల్లో 2వ సంవత్సరం నుంచి సెమిస్టెర్లు వుంటాయి.చెన్నై లోని అన్నా యూనివర్సిటిలో అయితే మొదటి సంవత్సరం నుంచే మొదలవుతాయి].ఏదో అలా భయపడుతూనె “మమ” అనిపించేశాం.రెండవ సెమిస్టెర్ మొదలయింది.
                                          *                                     *                                   *
ఓ విషయం మరిచాను.మా కాలేజి పైకి తెలుగు మైనారిటి కాలేజి అని పిలవబడుతున్నా….ఇక్కడ చదువుతున్న వారంతా ఎక్కువ శాతం తెలుగు వారే.హాస్టల్ ఫీజు బాగా ఎక్కువగా అనిపించడంతో బయట రూం ఏర్పాటు చేయించి వెల్లిపొయారు మా నాన్న.కొత్తగా చేరిన వాళ్ళంతా హాస్టల్లోనే చేరడంతో మొదటి సంవత్సరం ఒంటరిగా గడపక తప్పలేదు.శని,ఆది వారాల్లో ఫ్రెండ్స్ నా రూం కి వస్తూండడంతో అలా కాస్త సమయం గడిచిపోయేది.నా భాష వాళ్ళకి అర్థం కాకపోయినా,వాళ్ళ భాష నాకర్థం కాకపోయినా మా ఇంటి ఓనరు కొడకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.అలా త్వరగానే తమిళం నేర్చుకోగలిగాను.
                                          *                                     *                                   *
చెన్నైకి తిరుపతి దగ్గరే కావడంతో ప్రతి 2,3 వారాలకొకసారి తిరుపతి వెళ్ళేవాడిని.తిరుపతి వెళ్ళినపుడల్లా మునిగాణ్ణి కలిసేవాడిని. అలా ఓసారి కలసినప్పుడు వివేక్ అనే వ్యక్తి గురించి చెప్పడం జరిగింది.వివేక్ ఇంటర్మీడియట్లో మునికి సీనియర్.నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అతణ్ణి మునితో కొన్నిసార్లు చూశాను.
వివేక్ సినిమాల్లో దర్శకత్వం చేయాలని చాలా గట్టిగా భీష్మించుక్కూర్చున్నాడు.ఎవరెన్ని విధాలుగా నచ్చజెప్పినా విన్లేదు. చదవడం మానేసి మాకందరికీ కథలు చెప్పడం మొదలుపెట్టాడు.కనీసం చదువయ్యాక అవకాశాలకోసం ప్రయత్నించమన్నా విన్లేదు. దాంతో బాగా అలోచించి ఒక షరతు మీద వాణ్ణి కట్టడి చేయగలిగాం.అదేంటంటే ఒక నెల రోజులు చెన్నై వచ్చి అవకాశాలకోసం ప్రయత్నించాలి.రాకపోతే చదువయ్యేవరకు వాటిని దూరంగా ఉంచాలి.ఒక వ్యక్తి ఊరు కాని ఊరు వచ్చి నెల రొజుల్లో అవకాశం దక్కించుకోవడం చాలా కష్టంతో,అద్రుష్టంతో కూడుకున్న విషయం.మొత్తానికి చెన్నై తీసుకొని వచ్చి ఒక నెల రోజులు నా రూంలో ఉండేలా నిర్ణయించుకున్నాం.
ఇదిలా జరుగుతూండగానే తొలి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి.మా క్లాసులో 60మందికి 7మంది మాత్రమే పాసయ్యారు. ఆ 7మందిలో నేనూ ఒక్కడినయ్యాను.అంతె,మా కాలేజి లెక్చెరర్లు,చైర్మన్ మమల్ని ఆకాశ్నికెత్తేశారు.ఇంతలోనే కలేజ్ డే అంటూ కోలాహలం మొదలయింది.స్పోర్ట్స్ అని,డ్యాన్స్ అని రకరకాల ప్రోగ్రాంస్ జరుగుతాయంట.అందరూ పిచ్చి పిచ్చిగా పేర్లు నమోదు చేసుకొని,ప్రాక్టిస్ నెపంతో క్లాసులకి రావడమే మానేశారు.నేను కూడా డ్యాన్స్,డ్రాయింగ్ లో పేరిచ్చాను.
                                          *                                     *                                   *
స్వతహాగా నాకు చిన్నపటి నుంచే డ్రాయింగ్ లో మంచి ప్రవేశం ఉంది.మా స్కూలులో దాదాపు చాలా ప్రైజులు వచ్చేవి.ఇక డ్యాన్స్ పై మక్కువతో సొంతంగానే సినిమా పాటలకనుగుణంగా స్టెప్పులు నేర్చుకున్నాను.ఇంటెర్ చదువుతున్నప్పుడు నా డ్యాన్స్ ని తొలిసారి పరిక్షించుకున్నా!!.అందరు బాగానే అభినందించారు.
మేము పేర్లు నమోదు చేసుకొనే ముందే చాలా మంది పేర్లు ఇచ్చేసి ఆర్భాటంగా ప్రాక్టిస్ కూడా మొదలుపెట్టేశారు.అలనాటి నాగేశ్వర్రావుగారి ‘ఒక లైలా కోసం’ పాట నుంచి అప్పుడే రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా వరకు ఏ పాటనీ వదల్లేదు. బోసు,బాలక్రిష్ణ లు మరో ఇద్దర్ని పోగేశారు.మొత్తనికి ట్రూప్ గా అయితే ఏర్పడ్డాం కాని ఏ పాటకి వేయాలో తెలియక చివరికి ఒక ఇంగ్లీష్ పాటని తీసుకున్నాం.అలా ఓ పదిరోజులపాటు మా ప్రాక్టిస్ నిరాడంబరంగా సాగింది.ఇంతలోనే సీనియర్ల దందా మొదలయింది.
                                          *                                     *                                   *
“ఎవ్వడ్రా నేను వేసిన పాటకి డ్యాన్స్ వేసేది…?!!ఒకసారి సీనియర్లు వేసిన పాటకి వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళేవరకు మళ్ళి ఎవ్వడూ ఆ పాటకి వేయకూడదు”…అని కండీషన్స్ పెట్టారు.దాంతో చాలా పాటలకి బ్రేక్ పడింది.మాది కూడా ఎవరో సీనియర్ వేశాడంట. మా ప్రాక్టిస్ ఆగిపోయింది.కాలేజ్ డే సమీపిస్తోంది.క్లాసులకి నామం పెట్టడం కోసం ప్రాక్టిస్ మొదలుపెట్టినవాళ్ళూ, సీనియర్ల ధాటికి బ్రేక్ పడ్డవాళ్ళూ ప్రాక్టిస్ అక్కడితో ఆపేశారు.చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.
డ్యాన్స్ వెయ్యాలన్న పట్టుదల మా ట్రూపులో బలంగా నాటుకుంది.మా ట్రూపులో నేను తప్ప ఎవరూ స్టేజి మీద ఎవరూ ట్రై చేయళేదు.’ఏ పాటకి వేయ్యాలి?’ అని బాగా అలోచించి చివరికి రొహిత్ నటించిన “గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని ‘తళుకు తళుకు తారకా…’ పాటకి ఫిక్స్ అయ్యాం.ప్రాక్తిస్ మళ్ళి మొదలయింది.వివేక్ ని చెన్నై కి రమ్మన్నాను.
                                          *                                     *                                   *
కొన్ని సినిమాలోని స్టెప్పులు,కొన్ని మా సొంత స్టెప్పులతో ప్రాక్టిస్ బాగానే సాగుతోంది.వివేక్ వచ్చాడు.రెండ్రోజులు చెన్నై లోని ప్రదేశాలు చూపించాను.మరో రెండ్రొజులు తనే చెన్నై చుట్టి వచ్చేశాడు.ఇద్దరి మధ్యా స్నేహం చిగురించింది.డ్రాయింగ్ కాంపిటిషన్ బాగానే పూర్తయ్యింది.ఎప్పుడెప్పుడాని ఊరిస్తూ వచ్చిన కాలేజ్ డే వచ్చేసింది.ఇంక రెండు రోజుల్లో కలేజ్ డే.
రోజులానే ఉదయం క్లాసులకి వెళ్ళి,మధ్యాహ్నం డ్యాన్స్ ప్రాక్టిస్స్ చూసుకొని కాస్త ఆలస్యంగా రూం కి చేరాను.లోపలి వైపు నుంచి తలుపులు వేసి ఉన్నాయి.
“వివేక్…వివేక్…!!!”…తలుపు కొట్టాను.లోపలి నుంచి ఎలాంటి సమాధనం లేదు.
“వివేక్…వివేక్…!!!”…కాస్త గట్టిగా అరిచాను.లోపలి నుంచి సన్నటి మూలుగువినిపించింది.
అంతే,నాలో కంగారు పెరిగింది.గట్టింగా తలుపుల్ని బాదాను.మధ్యలొ మాత్రమే గడిపెట్టి ఉండడం వలన నాలుగు సార్లు బాదగానే తెరుచున్నాయి తలుపులు.లోపలికి వెళ్ళి చూస్తే….అచేతనంగా పడి ఉన్నాడు…వివేక్.
ఉదయాన్నే కాస్త నీరసంగా ఉంది అన్నాడు.నాలుగు రోజులు బాగా తిరిగినందుకేమో అని ఇద్దరం పెద్దగా పట్టించుకొలెదు.ఇప్పుడు వచ్చి చుస్తే ఇలా…
కాళ్ళూ,చేతులు పని చేయట్లేదు.నోరు మాత్రమే పని చేస్తొంది.ఏమైన తొందర పడ్డావా అంటే అలాంటిదేమిలేదన్నాడు.మరిలా ఎందుకయ్యింది?
సమయానికి ఓనరు కూడా లేడు.ఓనరు భార్యతో ఏమైనా చెప్పినా నా తమిళం ఆమెకర్థం కాదు.ఆటో కోసం బయటకు వచ్చి వెతుకుతూండగా కనిపించారు మా సీనియర్లు.వారిలో మమల్ని డ్యాన్స్ వెయ్యొద్దన్న అతను కూడా ఉన్నాడు. వెంటనే వారి వద్దకు వెళ్ళి భొరున ఏడ్చేసాను.వాళ్ళు సహాయం చేయడంతో వివేక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.అప్పటికి ఒకటి,అరా సినిమాల్లో నటించి జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న వివేక్ ఫ్రెండ్ చెన్నై లోనే ఉన్నాడని తెలియడం తో అతనికి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసాను(అప్పటికి నా దగ్గర సెల్ ఫోన్ లేదు).జరిగింది తెలుసుకున్న మా ఓనరు వెంటనే హాస్పిటల్ కి వచ్చి పరామర్శించారు.ఏదైన సహాయం కావాలంటే అడగమని ధైర్యం చెప్పి వెళ్ళిఫోయారు.మా ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.ఆ సమయానికి మా నాన్న ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు.కష్టపడి అర్థం చేసుకున్న మా అమ్మకి,చెల్లాయికి ఓ విషయం మత్రమే అర్థమయింది. “ప్రకాష్,ఫ్రెండ్….హాస్పిటల్!!!”….
                                          *                                     *                                   *
రాత్రి పది గంటలు దాటింది.వివేక్ ఫ్రెండ్ వచ్చాడు.హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ పాయిజన్ కింద వివేక్ పేరు నమోదు చేశారు.దాంతో హాస్పిటల్ వారితో వాదనకు దిగాం.ఇంతలో నన్నెవరో పిలిచారు.
“ప్రకాష్…?!!…మీరేనా!!మీకు రెండు సార్లు ఫోన్ వచ్చింది”.
‘…!!?!’ ఎవరబ్బా అనుకొని మట్లాడాను.
‘నాని(మా నాన్న నన్నలానే పిలుస్తారు)!నేన్రా…ఏమైంది.మీ ఓనరు ఫొన్ చేశారు…’అంటూ జరిగిన విషయం చెప్పారు.మా ఓనరు వాళ్ళు చెప్పింది సరిగ అర్థం చేసుకోలేని మావాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు.ఇంటికొచ్చిన మా నాన్న మా ఓనరుతో మట్లాడి హాస్పిటల్లో ఉన్నది నేను కాదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.మా నాన్నకు జరిగిన విషయం చెప్పాను.దాంతో వాళ్ళు కుదుటపడ్డారు.
డాక్టర్లు ఏవేవో ఇంజెక్షన్లు ఇస్తున్నారు.సెలైన్ బాటిల్ ఎక్కించారు.వివేక్ వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకున్నాం కాని మరి ఇంత రాత్రి వేళ చెప్పడం ఎందుకులే అని ఆగాం.నేను ,వివేక్ ఫ్రండ్ ఇద్దరం రాత్రంతా హాస్పిటల్లోనే గడిపాము.తెల్లారింది.మ దగ్గరున్న డబ్బులు అయిపోవచ్చాయి.వివేక్ పరిస్థితి లో ఎలాంటి మార్పూలేదు.వివేక్ వాళ్ళింట్లో చెప్పాలనుకొని నెంబర్ అడిగాం.ఊరి కాని ఊరు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారనీ,తననే తిరుపతికి తీసుకెళ్ళమని చెప్పాడు.
దాక్టర్లు ఇంజెక్షన్లు వేశాక తీసుకెళ్ళొచ్చని చెప్పారు.కాని ఎలా తీసుకెళ్ళాలి??అంబులెన్స్ కి అయ్యే ఖర్చు కూడా మా దగ్గర లేకపోవడంతో ఒక ఆటో ని మట్లాడుకున్నాం.నాలో కంగారు పోయి ధైర్యం వచ్చింది.విషయం తెలిసిన బోసు,బాలక్రిష్ణ తోడుగా వస్తామని అన్నా వారించి వద్దని చెప్పేశాను.ఇంక వివేక్ ఫ్రెండ్ అవసరం లేక పోవడంతో అతన్ని వెళ్ళమని చెప్పి తిరుపతి కి ఆటోలో బయలుదేరాం…నేను…వివేక్…ఇద్దరు ఆటోడ్రయివర్లు.
                                          *                                     *                                   *
ఆటో డ్రయివర్లు తమ నైపుణ్యానికి పనిచెప్పి అడ్డదారులలో బస్సుకన్నా వేగంగా మమల్ని వివేక్ ఇంటికి చేర్చారు.వివేక్ తలితండ్రులతో మట్లాడాక నా మనసు కొంచం కుదుట పడింది.వివేక్కి పుట్టినప్పటి నుంచే పొటాషియం డెఫీషియన్సి(శరీరంలో పొటాషియం శాతం తక్కువ) ఉందంట.అప్పుడప్పుడూ స్ప్రుహతప్పడం తప్ప ఇలా ఎప్పుడూ జరగలేదంట.వాళ్ళే ప్రమాదం లేదని చెప్పడం,నా అవసరం ఇంకలేదని తెలిశాక తిరిగి అదే ఆటోలో చెన్నైకి బయలుదేరాను.రాత్రి సరిగా నిద్ర లేకపోవడంతో ఆటోలో బాగా నిద్రపొయాను.
చెన్నై చేరేసరికే సాయంత్రం అయింది.రూం కెళ్ళగానే బాగా వేడినీటిలో స్నానం చేసి రాత్రి హాస్టల్ కి వెళ్ళాను.రేపే కాలేజ్ డే.స్టేజి అప్పుడే కట్టేశారు.ఎవరికీ తెలియకుండా తక్కువ సౌండ్ పెట్టుకొని స్టేజి పైన వేసి చూసుకున్నాం.బాగానే వచ్చింది.అయిపోయాక వచ్చి బాగా రిలాక్స్ అయ్యాను.
                                          *                                     *                                   *
కాలేజ్ డే.
ప్రేక్షకుల చప్పట్లు,ఈలలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.డ్రాయింగ్ లో ద్వితీయ బహుమతి వచ్చింది.
గ్రూప్ డ్యాన్స్ లొ మాదే టాప్.స్టేజి దిగంగానే లెక్చరర్లు,చైర్మన్ స్పెషల్ గా అభినందించారు.నా టీం మేట్స్ పండగ చేస్కున్నారు.
సంతోషంగానే ఉన్నా నాకు మాత్రం ఏదో ఫీలింగ్…..వివేక్ గురించి.తర్వాతి రోజులు శని,ఆదివారమే కావడంతో వెంటనే తిరుపతి బయలుదేరాను.
నేను,ముని కల్సి వివేక్ ని కలిశాము.ఆశ్చర్యం!!!తను ముందులానే మామూలుగా తిరుగుతున్నాడు.మొహం లో మాత్రం కొద్దిపాటి నీరసం కనిపిస్తోందంతే.వివేక్ ని దింపి మెము చెన్నై బయలుదేరాక తనని గవర్నమెంటు ఆస్పత్రిలో చేర్చారంట.అక్కడ 150 రూపాయల పొటాషియం ఇంజెక్షన్ ఒకటి ఇవ్వగానే గంటలో లేచి కూర్చున్నాడంట.బాగా నీరసం వచ్చినప్పుడు 70 రూపాయల పొటాషియం మందు బాటిల్ కొని ఒక వారం రోజులు త్రాగమన్నారంట డాక్టర్లు.
అనవసరంగా మా పర్సుల్ని ఖాళీ చేయించిన ప్రైవేట్ హాస్పిటల్ ని బాగా తిట్టుకొని,వివేక్కి ఏమికానందుకు చాలా సంతోషించాను. నేనిలా ఆటోలోతిరుపతి వచ్చిన విషయం మా ఇంట్లో తెలియనివ్వలేదు.అలా చెబితే కంగారు పడాతారని వివేక్ కి కొంచం నయమయ్యాక తనే తిరుపతి వెళ్ళిపోయాడని చెప్పాను.కాలేజ్ డే కన్నా ఇదే అసలైన ఆనందం అనిపించింది నాకు.
                                          *                                     *                                   *
వివేక్ ని ఆటోలో తిరుపతి కి తీసుకెళ్ళిన విషయం కాలేజిలో తెలిసింది.అందరూ మమల్నిఆకాశానికెత్తేశారు.క్లాసులోకి వెళ్తే చాలు,ఒకటే ఈలలు,గోలలు.ఫష్టు క్లాసులో పాసవడం,డ్రాయింగ్ లో సెకండ్ ప్రైజ్,డ్యాన్స్ లొ కాలేజ్ టాప్ రావడంతో నన్నందరూ హీరోని చేసేశారు.ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆనందించాను.
వావ్….నేనా…!!!…హీరోన….?!!
లక్ష బెలూన్లు ఒక్కసారిగా ఆకాశంలోకెగిరిన ఆనందం.

                                          *                                     *                                   *
షరామామూలుగా పరీక్షలు సమీపిస్తున్నాయి.ముందుగ లాబ్ పరీక్షలు జరుగుతున్నాయి.నేను అప్పటికే ఒక లాబ్ పరీక్ష రాసి బయటకు వస్తున్నాను.ఇంతలో మా చైర్మన్ గారి భార్య పిలిచారు.
‘యెస్ మేడం!’…అన్నాను వినయంగా.
‘లాబ్ ఎగ్జాం ఎంతసేపు చేశావ్?’…
కొంచం కంగారుగా…’ఒక గంటసేపు…ఏమైంది మేడం!?!!’…
‘ఏమిలేదు…అరగంటలో చేసుంటే 100 మార్కులు,గంటలో చేసుంటే 90 పైన మార్కులు వేయిద్దామని…’అన్నారు.
యాహూ…….ఎగిరి గంతేసి అనవసరంగా గంట అని చెప్పానేమోనని నన్ను నేనే తిట్టుకున్నాను.
ఆ సెమిస్టరు లాబ్ పరీక్షలన్నిటిలోనూ 90,95 పైన మార్కులు వేయించారు.
మళ్ళీ లక్ష బెలూన్లు ఒక్కసారిగా ఆకాశంలోకెగిరిన ఆనందం.
నన్ను నేనే నమ్మలేకపోతున్నాను.ఎప్పుడూ 60-70శతం మార్కులు వచ్చే నాకు గరిష్టంగా 97మార్కులు వచ్చాయంటే ఎలా ఉంటుంది?!!..
చాలా సంతోషంగా మిగతా పరీక్షలు పూర్తిచేశాను.నా ఆనందానికి అవధుల్లేవ్….నేను…హీరోని…యాహూ…
కొన్ని రోజుల తర్వాత పరీక్షల ఫలితాలు వచ్చాయి.ఈసారి అరవైలో ఇరవై మంది పాసయ్యారంట.కంప్యూటర్ లాబ్ కెళ్ళి రెజల్ట్స్ చూసుకున్నాను.
మూడు లాబ్స్ లో వరుసగా 93,93,97.ఇంక సబ్జెక్ట్టుల్లో
67,14,28,58,24,21….
ఆ!..ఏంటిది!?!!!……  నాలుగు సబ్జెక్టులు......... ఫెయిలా…..
       ……!!.....???.........@@......@..........!&........!!…….
బాబోయ్….
ఆకాశంలో బెలూన్లు పగిలిపోతున్నాయి…
ఎక్కడో టైర్లు పంచర్లవుతున్నాయి…
కాళ్ళ క్రింద భూమి రెండుగా చీలిపోతోంది…ఇప్పుడేది దారి…

ఏడుకొండలవాడా వేంకటరమణా….

మహాయుగం



March 26, 2010 న తెలుగురత్నలో ప్రచురితం.
http://teluguratna.com/blog/2010/03/26/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%97%e0%b0%82/


బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని మందగించిన వేళ…
శివుడు ప్రళయ కాలభధ్రుడై విలయ తాండవం చేస్తున్న వేళ…
భూప్రపంచం మొత్తం దద్దరిల్లి పోతోంది… దిక్కులన్నీ పెక్కటిల్లేలా ఆర్తనాదాలతో నిండిపోతోంది!!!
ఒక వైపు మేఘాలు ఆగ్రహంతో అగ్ని కీలలనను ఉరుముతుంటే…. మరో వైపు అవే మేఘాలు జరిగిన దానికి వెకిలి కన్నీళ్ళు కారుస్తునట్లు హోరుగా వర్షిస్తునాయి…..
ఒక దిక్కున అకారణ భూకంపాలతో భారి కట్టడాలు సైతం కుప్పకూలిపోతుంటే…. మరో దిక్కున ఉవ్వెత్తున పోటెత్తే  అలలు ‘ఇది కూడ ఒక ఎత్తేనా’ అని అడ్డుపడే ఎత్తులను పరిహసిస్తూ అవలీలగా తమలో కలిపేసుకుంటున్నాయి.
అగ్ని పర్వతాలు బ్రద్దలౌతున్నాయి.ఉవ్వెత్తున ఎగిసి పడే అగ్ని జ్వాలలు ఇన్నాళ్ళూ తన మేధస్సుతో అంచెలుగా ఎదిగి, ప్రకృతిని శాసించగలిగి ‘ప్రపంచాన్ని సైతం జయించగలనూ’ అని ప్రకటించుంకున్న మూర్ఖ మానవుని ప్రయోగాల కోటల్ని ఛిద్రం చేస్తూ క్షణంలో భూస్థాపితం చేస్తునాయి.

మనిషి మనుగడ నేర్చింది ప్రకృతి నుంచే,దాన్ని విస్మరిస్తే ప్రకృతిలోనే కలసిపొవాలసిందె అని గుర్తుచెస్తూ ప్రతి ఒక్కరూ శిక్షింపబడుతునట్లు ప్రాణ భయంతో పరుగులెత్తిస్తునాయి.
ప్రాంతాలకతీతంగా సకల ప్రాణులూ భగవంతుని ప్రార్థించే వేళ….
తమను రక్షించే ఏదో శక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ…..
*                                                 *                                                 *
ఉన్నట్టుండి ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది.ఆ వెలుగు రెప్పపాటులో అంతకంత రెట్టింపవుతూ కళ్ళు మిరుమిట్లుగొలిపే కాంతి ఆవరించుకుంది.ఇప్పటి వరకు కటిక చీకటిని చూసి వుండచ్చుగాక, కటిక వెలుగులా(??…) ఇంత కాంతి ఉన్నా గుర్తించలేని విధంగా ప్రకాశించింది.సాటి ప్రాణి మీద ప్రేమ,దయలేని…అసలు పక్క వాడి ఎదుగుదలే చూడలేని అల్ప మానవుడి కళ్ళు ఇంతటి వెలుగును దర్శించడానికి అనర్హమంటూ వారి కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి.భూమి దారి తప్పి సూర్యుని కక్ష వైపు వెళ్తోందా లేక ఏదైనా వచ్చి ఢీకొనబోతోందా అని అశేష ప్రజానీకం(?) భయపడుతూండగా…..
ఆకాశంలో మెల్లగా ప్రత్యక్షమౌతోంది… ఓ రూపం!!!!
అప్పటి వరకు కళ్ళు తెరిచి చూడలేనంతగా ఆవరించిన కాంతి క్రమంగా సాధారణ స్థాయికి వస్తోంది.వెలుగుని చూడలేక కళ్ళు పోగా మిగిలిన ప్రాణికోటి మొత్తం నెమ్మదిగా కనులు తెరిచి అటు వైపే చూడసాగాయి.
మొదటగా…. కనులు….. ఆ తర్వాత…..పెదవులు!!!
అద్భుతం…మహాద్భుతం!!నమ్మశఖ్యం కాని నిజం!!!
జీవ జాతి మనుగడ కాపాడడం కోసం కలియుగాంతమున ‘కల్కీ గా అవతరించ శ్రీ మన్మహా విష్నువా!!!
పాపములను హరించి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు పంపగా వచ్చిన ఏసు ప్రభువ… లేక అల్లాన… అనుకుంటూ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించారు.కనిపిస్తునవి కళ్ళు పెదవులే అయినా ఏమని వర్నించగలం ఆ రుపాన్ని!!!
హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడిన ఉగ్ర నరసింహుని వలే పాపులను శిక్షించడానికి వచ్చిన భగవంతుని లాగా లేవవి.అమృతాన్ని అసురులకు దక్కనివ్వకుండా చాకచక్యంతో దేవతలకు మాత్రమే పంచిన మోహినీమూర్తి కళ్ళు వలే మనోహరంగా ఉన్నాయి.ఎన్ని కష్టాలు అనుభవించినా,ఒక్క బాణంతో లంకను శాసించినా చెరగని చిరునవ్వుగల  శ్రీరామచంద్రుని వలే నిర్మలంగా ఉన్నాయా పెదవులు.
ఆహా…ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎవరికీ దక్కని అరుదైన అవకాశం.ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలి.ఇంక ప్రాణాలు పోయినా పర్వాలేదు!!!
అలా క్షణ కాలం పాటు ముగ్దుల్ని చేసి ఆనందానుభూతులను కలిగించిన ఆ సుమనోహర రూపం క్రమంగా అదృశ్యమై ఓ చిన్న వలయాకారాన్ని సంతరించుకుంది.నూరు తప్పుల అనంతరం శిశుపాలుని పై సంధించిన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం వలే వేగంగా తిరుగుతూ భూమి వైపు దూసుకొచ్చింది.ఊహించని విధంగా పెద్దదవుతూ నిర్దేశింపబడినట్లుగ కొంతమంది మానవులను, జంతువులను, వృక్ష సంపదను తనలో ఐక్యం చేసుకుంటోంది.
కొంతమంది ప్రజానీకం దాన్ని చూసి ఏదో మాయని భయపడి పారిపోతూంటే,కొంతమంది అన్ని ఆశలూ వదిలేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అక్కడక్కడా మిగిలిన కొంతమంది భారతీయులకు మాత్రం ఓ విషయం స్పష్టంగా అవగతమౌతోంది…
సత్య యుగంలో జలప్రళయం సంభవించినపుదు మత్స్యావతారంలో వచ్చి మరో యుగమునకు అవసరమైన భూసంపదను ఒక ఓడలో చేర్చి,ప్రళయం తగ్గు వరకు ఆ ఓడను హిమవంత పర్వతం దగ్గర భద్రపరచినట్లు..!
పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని ఒరిగిపోకుండా కాపాడి అడుగంటిపోతున్న దేవతల ఆశల్ని నిలబెట్టినట్లు…!!
వేదాలను పవిత్ర గ్రంధాలను దొంగిలించి,భూప్రపంచాన్ని సముద్రగర్భంలోని పాతాళానికి తోసేస్తున్న హిరణ్యాక్షుడిని వరాహావతారంలో అంతమొందించి గ్రంధాలను,ప్రపంచాన్ని కాపాడినట్లు…అవును!అదే!!!
కల్కీగా మళ్ళీ అవతరించి తమను కాపాడడానికే ఆ మాయా వలయాన్ని సృష్టించాడు.బుడతడిగా వచ్చి సర్వలోకములను ఆక్రమించిన వామనుని పాదం వలే ఇంతై…ఇంతింతై అన్నట్లు ఆ వలయం రెట్టింపవుతోంది.పిల్లలు,పుణ్యాత్ములైన ముదుసలివాళ్ళు సైతం అందులోకి లీలగా వెళ్ళిపోతూండగా,అందులోకి ప్రవేశించుటకు ప్రయత్నించిన పాపులకది క్షత్రియులను చెండాడిన పరశురాముని గండ్రగొడ్డలిలాగా హెచ్చరిస్తోంది.తెగించి ముందుకి వెళ్ళిన వారు వెళ్ళినట్లుగానే చనిపోతున్నారు.
*                                                 *                                                 *
దుష్టులు శిక్షించబడ్డారు.మిగిలిన వారు వలయంలోకి వెళ్ళిపొయారు.వలయం సుడిగాలి వలే తిరుగుతూ వారిని సురక్షిత
ప్రదేశంలో వదిలేసింది. కార్యం పూర్తైయింది. యుగం ముగిసింది.
రాబోతున్నది అనందానుభూతులు పంచే స్వచ్ఛమైన సమాజం.
అవతరించబోతున్నది మరో యుగం…..మహాయుగం!!!!